Wednesday, November 9, 2011

'ఓ మై ఫ్రెండ్' మరో 'వసంతం'?

సిద్ధార్థ్, శ్రుతిహాసన్ సినిమా 'ఓ మై ఫ్రెండ్' కథ గురించి ప్రస్తుతం ఫిలింనగర్‌లో ఆసక్తికరమైన కథనాలు వెలువడుతున్నాయి. వేణు శ్రీరాంను డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా నవంబర్ 11న రిలీజ్‌కు సిద్ధమవుతోంది. కాగా ఈ సినిమా ఇదివరకు చిరంజీవి హీరోగా వచ్చిన 'ఇద్దరు మిత్రులు', వెంకటేశ్ హీరోగా వచ్చిన 'వసంతం' సినిమాల తరహాలో ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. 'ఇద్దరు మిత్రులు'లో చిరంజీవి, సాక్షి శివానంద్ మిత్రులుగా నటిస్తే, చిరంజీవి సరసన నాయికగా రమ్యకృష్ణ నటించింది. సాక్షికి జోడీగా సురేశ్ కనిపించాడు. అలాగే 'వసంతం' చిత్రంలో వెంకటేశ్, కల్యాణి స్నేహితులుగా నటిస్తే, వెంకటేశ్ సరసన ఆర్తీ అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. కల్యాణికి జోడీగా ఆకాశ్ కనిపించాడు. ఇప్పుడు 'ఓ మై ఫ్రెండ్' సినిమాలో సిద్ధార్థ్, శ్రుతి జంటగా గాక, స్నేహితులుగా నటించారని గట్టిగా వినిపిస్తోంది. అంటే సిద్ధార్థ్‌కి జోడీగా హన్సిక, శ్రుతికి జోడీగా నవదీప్ కనిపించనున్నారనేది ప్రచార సారాంశం. ఇదే నిజమైతే ఇప్పటికే 'ఇద్దరు మిత్రులు', 'వసంతం' సినిమాల్ని చూసిన జనం 'ఓ మై ఫ్రెండ్'ని బాగా రిసీవ్ చేసుకుంటారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పైగా 'ఇద్దరు మిత్రులు' సినిమా ఆశించిన రీతిలో ఆడలేదు కూడా. ఏదేమైనా కొద్ది రోజుల్లోనే 'ఓ మై ఫ్రెండ్' కథ గురించి జరుగుతున్న ప్రచారం నిజమో, కాదో తేలిపోనున్నది.

No comments: