Saturday, October 1, 2011

న్యూస్: ఆల్‌టైం రికార్డ్ దిశగా 'దూకుడు'

టాలీవుడ్ చరిత్రలో ఆల్‌టైం రికార్డ్ దిశగా మహేశ్-శ్రీను వైట్ల సినిమా 'దూకుడు' దూసుకుపోతోంది. తొలివారం కనీ వినీ ఎరుగని రీతిలో రూ. 50.07 కోట్ల గ్రాస్, రూ. 35.01 కోట్ల షేర్ సాధించి దక్షిణ భారత రికార్డుని సాధించింది. ఈ విషయంలో రజినీకాంత్ 'రోబో'ని సైతం అది అధిగమించడం విశేషం. తొలివారం కలెక్షన్ల విషయంలో 80 సంవత్సరాల తెలుగు సినీ చరిత్రని 'దూకుడు' తిరగరాసిందని ఆ చిత్ర నిర్మాతలు రాం ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర తెలిపారు. విడుదలైన ప్రతి ఏరియాలోనూ 'దూకుడు' సినిమా ఆల్‌టైం రికార్డ్ సృష్టించిందని వారు చెప్పారు. నైజాం ఏరియాలో తొలివారం 'దూకుడు' 12.51 కోట్ల గ్రాస్, 8.52 కోట్ల షేర్ సాధించి ట్రేడ్ పండితుల్ని నివ్వెరపోయేట్లు చేసింది. ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల్లోనూ ఈ సినిమా ఇలాంటి ఫీట్ సాధించడం అద్భుతమనే చెప్పాలి. అన్నిటికంటే ముఖ్యంగా అమెరికాలో 5 కోట్ల రూపాయలకు పైగా షేర్ సాధించడం అపూర్వం. అందుకే అక్కడి లాస్ ఏంజిల్స్ టైమ్స్, వెరైటీ లాంటి ప్రఖ్యాత పత్రికలు సైతం 'దూకుడు' విజయంపై ప్రత్యేక కథనాలు రాశాయి. మునుముందు ఈ సినిమా ఎన్ని రికార్డులు సాధిస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు చిన్న చిన్న హిట్లతోనే సరిపెట్టుకుంటూ వచ్చిన టాలీవుడ్‌కి ఇదే తొలి అతి పెద్ద విజయం కావడం గమనార్హం.

No comments: