Friday, October 14, 2011

న్యూస్: 'ఊసరవెల్లి' ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్?!

మహేశ్ 'దూకుడు' తొలివారం రూ. 50 కోట్ల గ్రా, రూ. 35 కోట్ల షేర్ సాధించిందని నిర్మాతలు ప్రకటిస్తే, మాది అంతకంటే పెద్ద రికార్డ్ అంటూ ఎన్టీఆర్ 'ఊసరవెల్లి' నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ ప్రకటనలిచ్చారు. ఆయనిచ్చిన ప్రకటన ప్రకారం ఆ సినిమా తొలి వారం రూ. 56 కోట్ల గ్రాస్, రూ. 39 కోట్ల షేర్ సాధించింది. అంటే షేర్ విషయంలో 'దూకుడు' కంటే 'ఊసరవెల్లి' నాలుగాకులు ఎక్కువ చదివిందన్న మాట. తొలి వారం కలెక్షన్లలో ఇది ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్. చిత్రమేమంటే 'దూకుడు'ది జెన్యూన్ విజయమని (నిర్మాతలు ఎక్కువ కలెక్షన్లు ప్రకటించ వచ్చు గాక) ఇండస్ట్రీ, ట్రేడ్ వర్గాలు అంగీకరిస్తుంటే, 'ఊసరవెల్లి'ది జెన్యూన్ విజయమని ఆ వర్గాల్లో అత్యధికులు నమ్మడం లేదు. ఎందుకంటే 'ఊసరవెల్లి' ఆడుతున్న చాలా థియేటర్లలో కనిపిస్తున్న ప్రేక్షకుల సంఖ్యే దానికి ప్రబల నిదర్శనం. అయితే తమదే రికార్డ్ విజయమని చెప్పుకోవడానికి హీరోలు, వారి అభిమానులు తాపత్రయపడుతుంటే రికార్డులు బద్దలు కాకుండా ఉంటాయా? రానున్న రోజుల్లో 'పంజా', 'రచ్చ' సినిమాలకి ఇంకెన్ని రికార్డులు బద్దలవుతాయోననే కామెంట్లు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ రికార్డుల దాహం ఎలాంటి పరిణామాలకి దారి తీస్తుందో తెలీదు కానీ ఇన్‌కంటాక్స్ డిపార్ట్‌మెంట్ మాత్రం 'దూకుడు', 'ఊసరవెల్లి' నిర్మాతల మీద వేయి కళ్లు వేసి చూస్తున్నట్లు సమాచారం.

No comments: