Wednesday, October 19, 2011

వేలానికి 'దూకుడు' దుస్తులు

శ్రీను వైట్ల రూపొందించిన 'దూకుడు' చిత్రంలోని క్లైమాక్స్ సాంగ్‌లో హీరో హీరోయిన్లు మహేశ్, సమంత ధరించిన ప్రత్యేక దుస్తుల్ని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ('మా') వేలానికి పెట్టింది. ఈ నెల 25లోగా ఎవరైతే ఎక్కువ ధరకి వేలం పాడతారో వారికి మహేశ్ చేతుల మీదుగా వాటిని అందజేస్తామని 'మా' అధ్యక్షుడు మురళీమోహన్ తెలిపారు. మంగళవారం నిర్మాతల మండలి హాలులో జరిగిన సమావేశంలో ఈ సంగతిని ఆయన ప్రకటించారు. "ఈమధ్య కాలంలో అనేక ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో ఉన్న సినీ పరిశ్రమకు మహేశ్, శ్రీను వైట్ల సినిమా 'దూకుడు' ఓ ప్రభంజనాన్ని సృష్టిస్తూ ఊపిరిపోసింది. మన రాష్ట్రంలోనే కాక అమెరికాలోనూ గత రికార్డుల్ని బద్దలు కొడుతోంది. కలెక్షన్ల విషయంలో 'మగధీర'ను కూడా అధిగమించి ముందుకు పోతోంది. రూ. 80 కోట్ల వసూళ్ల అంచనాల్ని దాటి రూ. వంద కోట్ల అంచనాలకి చేరుకోవడం సామాన్య విషయం కాదు. ఈ సినిమాతో మహేశ్ ఇమేజ్ ఎంతగా పెరిగిందంటే ఓ వెబ్‌సైట్ నిర్వహించిన పోల్‌లో ప్రపంచవ్యాప్తంగా 50 మంది సెలబ్రిటీల్లో 12వ స్థానంలో మహేశ్ వచ్చాడు. అదీ అతని ఘనత. శ్రీను వైట్ల హీరోలతో కామెడీ చేయిస్తే తిరుగుండదని 'దూకుడు' మరోసారి చెప్పింది. కేవలం కమెడియన్లతోటే కాకుండా హీరోలతోనూ కామెడీ చేయించి మెప్పిస్తుంటాడు. త్వరలో హిందీలోనూ 'దూకుడు'ను డైరెక్ట్ చేయబోతున్నాడు. అతను అక్కడా విజయఢంకా మోగించాలి. గతంలో కొన్ని సినిమాల వస్తువుల్ని వేలం వేసి పేద కళాకారుల కోసం వినియోగించాం. ఇప్పుడు 'దూకుడు'లో హీరో హీరోయిన్లు మహేశ్, సమంత ధరించిన కాస్ట్యూమ్స్‌ని వేలం వేస్తున్నాం'' అని చెప్పారు.
శ్రీను వైట్ల మాట్లాడుతూ "దూకుడు సినిమా ఎంతగా రికార్డు కలెక్షన్లని సాధిస్తున్నదో అందుకు తగ్గట్లుగా ఈ కాస్ట్యూమ్స్‌ని మహేశ్ అభిమానులు అధిక ధరకు సొంతం చేసుకుంటారని ఆశిస్తున్నా. తద్వారా వారు ఓ మంచి పనికి ఉపయోగపడతారు. మేం కూడా ఊహించని స్థాయిలో 'దూకుడు' హిట్టయింది'' అని తెలిపారు.
శ్రీను వైట్ల తన సినిమాల్లో తెలుగు నటులకి అవకాశమివ్వాలని 'మా' సంయుక్త కార్యదర్శి మహర్షి సూచించారు. ఈ కార్యక్రమంలో మాస్టార్స్ డాట్ కామ్ శేఖర్, 'మా' సభ్యులు జయలక్ష్మి, మాణిక్ పాల్గొన్నారు.

No comments: