Monday, October 3, 2011

న్యూస్: 'దూకుడు'ని అడ్డుకోవడమే 'ఊసరవెల్లి' లక్ష్యం!

మొత్తానికి 'ఊసరవెల్లి'ని అక్టోబర్ 6న రిలీజ్ చేయడానికే నిర్మాత ఛత్రపతి ప్రసాద్ నిశ్చయించేశారు. ఈ సినిమా నిజంగా 6న వస్తుందా లేక, 13కి వాయిదా పడుతుందా? అనే సందేహం తలెత్తింది. ఎందుకంటే సెప్టెంబర్ 23న రిలీజైన మహేశ్ 'దూకుడు' రికార్డ్ కలెక్షన్లు సాధిస్తోంది. ఎక్కువ థియేటర్లలో ఆడుతోంది. అలాంటప్పుడు 'ఊసరవెల్లి'కి ఎక్కువ థియేటర్లు దొరుకుతాయా అనే సందేహం కలిగింది. పైగా 'ఊసరవెల్లి'కి మంచి కలెక్షన్లు రావాలన్నా ఒక వారం ఆలస్యంగా విడుదల చేస్తేనే మంచిదనే అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. వాళ్ల అభిప్రాయం ప్రకారం 'ఊసరవెల్లి' అక్టోబర్ 13న విడుదలైతే ఇటు దానికీ, అటు 'దూకుడు'కీ ప్రయోజనం ఉంటుందని వాళ్లు సూచిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ మరో రకంగా తలుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 'దూకుడు' రికార్డులకి బ్రేక్ వెయ్యడంతో పాటు, టాలీవుడ్ నెంబర్‌వన్ రేసులో తానూ ముందున్నట్లు చెప్పాలనేది అతని అభిమతంగా ఫిలింనగర్ వాసులు చెప్పుకుంటున్నారు. ఎన్టీఆర్, సురేందర్‌రెడ్డి కాంబినేషన్‌లో ఇదివరకు వచ్చిన 'అశోక్' ఫెయిలైంది. ఇప్పుడు ఎలాగైనా సూపర్‌హిట్ కొట్టాలనే తపనతో ఆ ఇద్దరూ 'ఊసరవెల్లి'కోసం కృషిచేశారు. తప్పుకుండా ఈ సినిమా బిగ్ హిట్టవుతుందనే నమ్మకం ఎన్టీఆర్‌లో కనిపిస్తోంది. అందుకే ఆరునూరైనా అక్టోబర్ 6నే సినిమా విడుదల చేయాలని అతను పట్టుపట్టడంతో నిర్మాత ప్రసాద్ మరో దారిలేక విడుదలకు సిద్ధమయ్యారు. ఒక్కటి మాత్రం నిజం. 'ఊసరవెల్లి' రాక 'దూకుడు' రికార్డుల్ని ప్రభావితం చేయనున్నది. ఆ ప్రభావం థియేటర్ల సంఖ్య మీదా, కలెక్షన్ల మీదా కనిపించనున్నది. చూద్దాం, ఎన్టీఆర్ పట్టుదల చివరికి ఎలాంటి పరిస్థితుల్ని కల్పిస్తుందో...

No comments: