Saturday, October 29, 2011

కీలక దశలో నాగచైతన్య కెరీర్

అక్కినేని నాగచైతన్య కెరీర్ కీలక దశలో ప్రవేశించింది. ఇప్పటివరకు నాలుగు సినిమాలు చేసిన అతను రెండు ఫ్లాపులు, రెండు హిట్లతో బేలన్స్‌గా ఉన్నాడు. తొలి సినిమా 'జోష్', నాలుగో సినిమా 'దడ' ఫ్లాపవగా; రెండు, మూడు సినిమాలైన 'ఏమాయ చేసావె', '100% లవ్' సినిమాలు హిట్టయ్యాయి. అయితే మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అవుదామని అతడు చేసిన 'దడ' సినిమా డిజాస్టర్ కావడం అతడికి కొంత నిరుత్సాహాన్ని కలిగించింది. టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గ్లామర్ కానీ, కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి విదేశాల్లో రిచ్‌గా చిత్రీకరించిన ఫైట్లు గానీ, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ గానీ సినిమాని రక్షించలేకపోయాయి. అంతకు మించి నాగచైతన్య కేరక్టర్ ప్రేక్షకుల్ని మెప్పించలేక పోయింది. ఫలితంగా కామాక్షి మూవీస్ అధినేత డి. శివప్రసాద్‌రెడ్డి ఖాతాలో మరో ఫ్లాప్ జతకూడింది. ఈ నేపథ్యంలో నాగచైతన్య రెండు ఆసక్తికర సినిమాలు చేస్తున్నాడు. వాటిలో ఒకటి రాంగోపాల్‌వర్మ నిర్మిస్తున్న 'బెజవాడ' కాగా మరొకటి దేవా కట్టా డైరెక్ట్ చేస్తున్న 'ఆటోనగర్ సూర్య'. వీటిలో 'బెజవాడ' సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని నవంబర్ ఫస్ట్ వీక్‌లో రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సినిమా మొదలు పెట్టినప్పట్నించే వార్తల్లో ఉండటం వల్ల అందరి దృష్టీ దీనిపైన ఉంది. ఇక 'ఆటోనగర్ సూర్య' ఇప్పుడే మొదలైంది. ఇందులో చైతన్య, సమంత జంటగా రెండోసారి నటిస్తున్నారు. దేవా కట్టా ప్రతిభావంతుడైన దర్శకునిగా ఇప్పటికే రుజువు చేసుకున్నందున ఈ సినిమా మీద కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ సినిమాల్లో ఒక్కటైనా హిట్టయితేనే స్టార్ హీరోగా నాగచైతన్య రూపుదాల్చే అవకాశాలుంటాయి.

No comments: