Thursday, October 27, 2011

న్యూస్: 'ఓ మై ఫ్రెండ్' మీదే సిద్ధు ఆశలు!

2006లో వచ్చిన 'బొమ్మరిల్లు' తర్వాత సిద్ధార్థ్‌కి చెప్పుకోదగ్గ సినిమా ఏది? ఏదీ లేదు. ఈ మధ్య కాలంలో అతను చేసిన సినిమాలు - 'ఆట' (యావరేజ్), 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' (యావరేజ్), 'ఓయ్' (డిజాస్టర్), 'బావ' (డిజాస్టర్), 'అనగనగా ఓ ధీరుడు' (ఫ్లాప్), '180' (యావరేజ్). ఇదీ అతడి ప్రస్థానం. తెలుగు హీరో అనిపించుకోడానికి ఏడేళ్లు పట్టిందని ఈమధ్య ఇంటర్వ్యూల్లో అతడు చెప్పాడు కానీ మన వాళ్లెవరూ అలా ఫీలవుతున్నట్లు కనిపించడం లేదు. ప్రస్తుతం తెలుగులో కోల్పోయిన ఇమేజ్‌ని తిరిగి తెప్పించుకోడానికి అతను కష్టపడుతున్నాడు. దిల్ రాజు రూపంలో అతగాడికి ఓ మంచి ఫ్రెండ్ దొరకడం అతడు చేసుకున్న భాగ్యం. అందుకే 'ఓ మై ఫ్రెండ్' సినిమాని సిద్ధార్థ్‌తో తీస్తున్నాడు రాజు. వేణు శ్రీరాం దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో సిద్ధార్థ్ 'క్లోజ్ ఫ్రెండ్' శ్రుతిహాసన్, హన్సిక హీరోయిన్లుగా నటించారు. నవదీప్ మరో కీలక పాత్ర చేశాడు. కొత్త మ్యూజిక్ డైరెక్టర్ రాహుల్ రాజ్ మ్యూజిక్ ఇచ్చిన ఈ సినిమా ఆడియో అక్టోబర్ 15న రిలీజైంది. పాటలు బాగానే ఉన్నాయని సంగీత ప్రియులు చెబుతున్నారు. ఈ సినిమాతో మరోసారి 'బొమ్మరిల్లు' మేజిక్‌ని రిపీట్ చేస్తానని నమ్ముతున్నాడు సిద్ధు. నిజానికి అది అతడికి చాలా అవసరం కూడా. ఎందుకంటే 'ఓ మై ఫ్రెండ్' కూడా ఆడకపోతే తెలుగులో అతడి కెరీర్ నిజంగా కష్టాల్లో చిక్కుకున్నట్లే. నవంబర్లోనే ఈ సినిమా రిలీజవుతున్నందున అతడి భవిష్యత్ ఏమిటో అప్పుడు తేలనున్నది.

No comments: