Saturday, December 10, 2011

'నూతిలో కప్పలు'... పైకి రావు, రానివ్వవు

డాక్టర్ రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రధారిగా 'నూతిలో కప్పలు' అనే సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. 'పైకి రావు.. రానివ్వవు' అనేది ఉప శీర్షిక. పోల్‌స్టార్ పిక్చర్స్ పతాకంపై వినయ్, పూనాటి ఎస్. సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చంటి జ్ఞానమణి దర్శకునిగా పరిచయమవుతున్నారు. భరత్‌భూషణ్, విజయ్‌సాయి, రామ్‌తేజ హీరోలుగా, ప్రతీక్ష హీరోయిన్‌గా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు క్లాప్‌నివ్వగా, శరత్ మరార్ కెమెరా స్విచ్చాన్ చేశారు. దీనికి సీనియర్ డైరెక్టర్ బి. గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో 24 మంది దర్శకులు పాల్గొనడం గమనార్హం.
ఈ చిత్రం విజయం సాధించాలని రచయిత చిన్నికృష్ణ, శరత్‌మరార్, దర్శకులు వి. సముద్ర, అంజి శ్రీను, టి. వేణుగోపాల్ ఆకాంక్షించారు. 
సహ నిర్మాత వి. శివాజీరాజు మాట్లాడుతూ జనవరి తొలి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుతామన్నారు. 'నూతిలో కప్పలు... పైకి రావు, రానివ్వవు' అనే టైటిల్‌తోటే సినిమా కథ ఎలా ఉంటుందనేది అర్థం చేసుకోవచ్చునని దర్శకుడు చంటి తెలిపారు. నిర్మాతల్లో ఒకరైన వినయ్ మాట్లాడుతూ "చక్కని ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ సినిమా రూపొందబోతోంది. చాలామంది వ్యక్తులు తాము పైకి రాకపోవడమే కాక, పైకి రావాలనుకున్న వాళ్లని కూడా రానివ్వకుండా చేస్తుంటారు. అలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తుల కథే ఈ చిత్రం. దర్శకుడు చంటి నా తమ్ముడు. ఇప్పటికే పలు సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేశాడు. ప్రతిభావంతుడు. ఈ చిత్రాన్ని బాగా రూపొందిస్తాడనే నమ్మకం ఉంది'' అని చెప్పారు. 
రవిబాబు, అల్లరి సుభాషిణి, తాగుబోతు రమేశ్, జోగినాయుడు తారాగణమైన ఈ చిత్రానికి కథ: వినయ్ జ్ఞానమణి, మాటలు: మహేంద్ర, తిరుపతి, సంగీతం: సుభాష్, ఛాయాగ్రహణం: ఎస్. మురళీమోహన్‌రెడ్డి, కళ: హరిబాబు, నృత్యాలు: వి.జె. శేఖర్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చంటి జ్ఞానమణి.

No comments: