Wednesday, December 14, 2011

త్రివిక్రం ఎదుట సవాలు

దర్శకుడిగా హ్యాట్రిక్ హిట్స్ కొట్టి నాలుగో సినిమాతో బోల్తాపడ్డ త్రివిక్రం ఐదో సినిమాతో సవాలును ఎదుర్కొంటున్నాడు. అతను డైరెక్ట్ చేసిన 'నువ్వే నువ్వే', 'అతడు', 'జల్సా' సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి హిట్టయిన సంగతి తెలిసిందే. అదివరకు రచయితగా టాప్ రేంజ్ పొందిన త్రివిక్రం ఈ మూడు సినిమాలతో డైరెక్టర్‌గానూ టాలీవుడ్ టాప్‌లీగ్‌లో చేరిపోయాడు. అయితే అతడి నాలుగో సినిమా తొలి ఫ్లాప్‌ని అతడి జాబితాలో చేర్చింది. ఆ సినిమా 'ఖలేజా'. మహేశ్ హీరోగా అతడు డైరెక్ట్ చేసిన రెండో సినిమా ఇది. 'మగధీర' స్ఫూర్తితో తీయడం వల్ల ఈ సినిమాలో ఒరిజినాలిటీ మిస్సయ్యిందనే అపవాదుతో పాటు మహేశ్, అనుష్క మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ కాలేదనే విమర్శా వచ్చింది. కథలోనే దమ్ములేదనే మాట ఎలాగూ ఉంది. 
ఈ సినిమాతో దెబ్బతిన్న త్రివిక్రం ఇప్పుడు అల్లు అర్జున్‌ని డైరెక్ట్ చేయడంలో నిమగ్నమయ్యాడు. నవంబర్ 2న ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. అర్జున్ సరసన ఇలియానా తొలిసారి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాతో బంపర్‌హిట్ కొట్టి తన సత్తా చాటాలని ఆశిస్తున్నాడు త్రివిక్రం. తొలి మూడు సినిమాలతో దర్శకుడిగా త్రివిక్రంలోని ప్రతిభ ఆవిరైందనీ, అందువల్లే 'ఖలేజా' లాంటి సబ్జెక్ట్ చేశాడనీ వచ్చిన విమర్శల్ని తాజా సినిమాతో తిప్పికొట్టాలని అతను భావిస్తున్నాడు. ఈ సవాలుని అతడు ఎలా అధిగమిస్తాడో చూడాల్సిందే.

No comments: