Tuesday, December 27, 2011

ప్రివ్యూ: కంపెనీ

ఈ మధ్య కాలంలో వార్తల్లో వ్యక్తులుగా నిలిచిన మద్దెలచురువు సూరి, భానుకిరణ్, సి. కల్యాణ్ వంటి వ్యక్తుల జీవితాల్లో చోటు చేసుకున్న సంఘటనల స్ఫూర్తితో దర్శకుడు వీరు కె. రూపొందించిన సినిమా 'కంపెనీ'. రమాశ్రీ క్రియేషన్స్ బేనర్‌పై లక్కరాజు రాధారాజేశ్వరి ఈ చిత్రాన్ని నిర్మించారు. 
సినిమా గురించి వీరు కె. మాట్లాడుతూ "కొన్ని వాస్తవిక సంఘటనల్ని ఇందులో సినిమాటిగ్గా చూపించాం. మద్దెలదరువు నూరి, బాలుకిరణ్, కె. చియాన్ అనే మూడు ప్రధాన పాత్రల చుట్టూ తిరిగే కథాంశంతో దీన్ని తీశాం. రూ. 500 కోట్ల రూపాయల స్కాం, మద్దెలదరువు నూరి అనే పాత్ర జైలు నుంచి రిలీజైన కొద్ది రోజులకే హత్యకు గురవడం, ఆ హత్యకు కారకుడని అనుమానిస్తున్న బాలుకిరణ్ అనే అతను పరారీ కావడం వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. మూడు క్లబ్, పబ్ మిక్స్ పాటలు హిందీలో ఉంటాయి. వీటిని యాక్షన్ హీరోయిన్‌గా నటిస్తున్న స్వాతివర్మపై రొమాంటిగ్గా చిత్రీకరించాం" అని చెప్పారు. 2012 జనవరిలో విడుదలకు సిద్ధమవుతోంది 'కంపెనీ'.
మద్దెలదరువు నూరిగా సురేశ్, బాలుకిరణ్‌గా 'బద్రీనాథ్' ఫేం హ్యారీ, కె. చియాన్‌గా దండపాణి, నూరి గర్ల్‌ఫ్రెండ్‌గా స్వాతివర్మ, రాంభూపాల్‌శర్మగా సుమన్‌శెట్టి నటించిన ఇందులో జీవా, సూర్య, కృష్ణభగవాన్, చిత్రం బాషా, శకుంతల, సంధ్య ఇతర తారాగణం. వీరు కె. స్వయంగా సంగీతం సమకూర్చిన ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ: అరుణ్, ఎడిటింగ్: నాగిరెడ్డి.

No comments: