Tuesday, December 13, 2011

ఇంటర్‌వ్యూ: వెంకటేశ్

నేను కలలు కనను


"నేను కలలు కనను కాబట్టి డ్రీమ్ ప్రాజెక్టులనేవి ఉండవు. ఏదన్నా చెయ్యాలనుకుంటే సిన్సియర్‌గా చెయ్యడమే'' అని చెప్పారు హీరో వెంకటేశ్. ఆయనతో శ్రీ సాయిగణేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేశ్ నిర్మిస్తున్న 'బాడీగార్డ్' చిత్రం సంక్రాంతికి విడుదల కాబోతోంది. త్రిష నాయికగా నటించిన ఈ చిత్రానికి 'డాన్ శీను' ఫేమ్ గోపీచంద్ మలినేని దర్శకుడు. మంగళవారం వెంకటేశ్ జన్మదినం. ఈ సందర్భంగా 'బాడీగార్డ్'తో పాటు, తన తదుపరి చిత్రాల గురించీ, జీవితం పట్ల తన ఆలోచనలూ, అభిప్రాయాల గురించీ విపులంగా సంభాషించారు. అవేమిటో ఆయన మాటల్లోనే...


'బాడీగార్డ్' వచ్చిన తీరుకి చాలా హ్యాపీగా ఉన్నా. జనవరి 12న రిలీజ్. సంక్రాంతికి మంచి ఆల్‌రౌండ్ సినిమా అవుతుంది. మంచి ఎంటర్‌టైనర్. ఫ్యామిలీ డ్రామా, చక్కని సంగీతం ఉన్నాయి. తమన్ చాలా బాగా సంగీతం ఇచ్చాడు. తొలిసారి అతనితో కలిసి పనిచేశా. ఇతర సినిమాలకంటే ఎక్కువగా దీన్ని సంగీతభరిత చిత్రం చేశాడు. అతనిచ్చిన నేపథ్య సంగీతం గురించి కూడా చెప్పుకుంటారు.
నేను వెంకటాద్రిని 
ఇది గుడ్ క్లీన్ ఫిల్మ్. మలయాళ ఒరిజినల్ 'బాడీగార్డ్'తో పోలిస్తే మన అభిరుచికి తగ్గట్లు స్క్రిప్టులో కొన్ని మార్పులు చేశాం. ప్రేక్షకులకి మంచి ఫీల్‌నిస్తుంది. ఇందులో నా పాత్ర పేరు వెంకటాద్రి. 'చంటి' తర్వాత ఓ అమ్మాయికి బాడీగార్డుగా ఉండి కాలేజీ క్యాంపస్‌కి వెళ్లడం మళ్లీ ఈ చిత్రానికే. ఆ సన్నివేశాలన్నీ బాగా వచ్చాయి. లవ్ స్టోరీ ఈజ్ వెరీ యూనిక్. త్రిష, నేను ఇదివరకు కలిసి చేసిన 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' తర్వాత తనది ఇందులో మరో మంచి పాత్ర. చివరి 30 నిమిషాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. యాక్షన్ సన్నివేశాలు చాలా బాగా వచ్చాయి. రామ్-లక్ష్మణ్ బాగా కంపోజ్ చేశారు.
చక్కని దర్శకుడు, మంచి నిర్మాత 
గోపీచంద్ మంచి డైరెక్టర్. సింపుల్ అండ్ సిన్సియర్. అతనితో మంచి రాపో కుదిరింది. సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె. నాయుడు మంచి కెమెరా పనితనం చూపించాడు. బెల్లంకొండ సురేశ్‌తో ఇది నాకు రెండో సినిమా. అతను మంచి నిర్మాత. చక్కని నిర్మాణ విలువలతో తీశాడు. మిగతా సినిమాలన్నింటి కంటే భారీ ఎత్తున చేశాడు. ఇటీవలి కాలంలో చూడని చాలా అందమైన ప్రదేశాల్లో చిత్రీకరణ జరిపారు. దానికి నేను గ్యారంటీ.
తదుపరి చిత్రాలు 
ఈ నెల 16 నుంచి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' షూటింగ్‌లో పాల్గొనబోతున్నా. ఇది చాలా చక్కని చిత్రం. చాలా రోజుల తర్వాత ఓ అందమైన ఫ్యామిలీ ఫీల్‌తో, ఇద్దరు అన్నాతమ్ముళ్ల జీవిత ప్రయాణంతో, వాళ్ల ఎత్తుపల్లాలతో రాబోతున్న చిత్రం. నేను, మహేశ్ కలిసి చేయడానికి ఉద్వేగంతో ఎదురుచూస్తున్నాం. దీని తర్వాత మల్టీస్టారర్స్ పెరుగుతాయని ఆశిస్తున్నా. సంవత్సరానికి ఒకటాన్నా వస్తే బాగుంటుంది. దీనితో పాటు మెహర్ రమేశ్‌తో బాగా స్టయిలిష్‌గా ఉండే యాక్షన్ ప్రధాన చిత్రం చేయబోతున్నా. అందులో ఫ్యామిలీ డ్రామానీ, వినోదాన్ని చాలా తెలివిగా మేళవించాడు రమేశ్. ఆల్‌రౌండ్ సాలిడ్ కమర్షియల్ అప్పీల్‌తో ఉంటుంది. 'సీతమ్మ వాకిట్లో..' తర్వాత నాకు వైవిధ్యమైన సినిమా అవుతుంది. 'వివేకానంద' 2012 ద్వితీయార్థంలో మొదలవుతుంది. మణిశంకర్ దర్శకుడు. స్క్రిప్టు సిద్ధమయింది.
'బొబ్బిలి రాజా' సీక్వెల్ 
'బొబ్బిలి రాజా'కి సీక్వెల్ చేయాలంటే ఇవాళ చాలా నియమ నిబంధనలు అడ్డుగా ఉన్నాయి. ఆ సినిమాలో చాలా జంతువులు ఉంటాయి. నిజమైన జంతువులతో చేయాలంటే చాలా పర్మిషన్లు తెచ్చుకోవాలి. దానికి చాలా టైమ్ పడుతుంది. వాటిని సడలిస్తే చేయొచ్చు. అందులో రానా కూడా చేస్తానంటున్నాడు సరదాగా.
రానాకే ఎక్కువ తెలుసు 
రానా ఊరంతా తిరుగుతున్నాడు. తిరగనివ్వండి. తెలుగు, తమిళం, హిందీల్లో చేస్తున్నాడు. వాడు కష్టజీవి. నాకన్నా ఎక్కువ సినిమా తపన ఉన్నవాడు. నిజంగా చెప్పాలంగా నాకన్నా సినిమా గురించి ఎక్కువ తెలుసు. చిన్నప్పట్నించీ సినిమా గురించి నేర్చుకుంటూ వస్తున్నాడు. సాంకేతికంగా సినిమా గురించి అధ్యయనం చేయడం గానీ, సినిమాకు సంబంధించిన పుస్తకాలు చదవడం గానీ నాకంటే ఎక్కువ చేస్తుంటాడు. చాలామందితో కలుస్తుంటాడు. ఇది ఆరోగ్యకరమైన విషయం. ఎప్పుడూ విభిన్నంగా ఆలోచిస్తుంటాడు. ప్రయోగాల కోసం తాపత్రయపడుతుంటాడు. దానివల్ల ప్రతిభ కూడా పెరుగుతుంటుంది. ఇప్పట్లో వాడూ, నేనూ కలిసి సినిమా చేసే అవకాశం లేదు.
అర్జున్ చిన్న పిల్లాడు 
మా అబ్బాయి అర్జున్ చాలా చిన్న పిల్లాడు. మూడో గ్రేడ్ చదువుతున్నాడు. అప్పుడే సినిమాలెందుకు? ఈ మధ్య స్కూల్లో ఓ ఎగ్జామ్‌కి సరిగా ప్రిపేరయినట్లు లేడు. దాంతో దిగాలుపడ్డాడు. నేనూ, మా ఆవిడా 'అదేమీ కంపల్సరీ కాదు కదా. రాయొద్దులే' అని చెప్పాం. కారులో కూర్చున్నాక "డాడ్. ఫియర్ ఈజ్ ద డార్క్‌సైడ్ ఆఫ్ ద పాత్'' అన్నాడు. అదేదో హాలీవుడ్ సినిమాలో డైలాగ్ అంట. వెళ్లి ఎగ్జామ్ రాశాడు. వాడికి ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమీ లేవు. పిల్లలు సహజంగా పెరగాలి. నిబంధనలు ఉండకూడదు. అన్నీ చేస్తుండాలి. సినిమాల్లో చెయ్యాలని వాడికి ఉంది. 'కరాటే కిడ్' చేస్తానంటున్నాడు.
శుభ పరిణామం 
ఇప్పటికే అందరు హీరోలూ వరుసగా సినిమా చేసుంటే ఇండస్ట్రీ బాగా సెట్టయి ఉండేది. ఏదేమైనా ఇప్పుడు చేస్తున్నందుకు సంతోషం. ఇది శుభ పరిణామం. అయితే బడ్జెట్ మీద కంట్రోల్ ఉండాలి. ఆ కంట్రోల్ లేకపోతే సమస్యలొస్తాయి. మినిమం గ్యారంటీ ఉండేట్లు చూసుకోవాలి. ఎక్కువ సినిమాలు చేసేప్పుడు ప్లానింగ్ ముఖ్యం. కథ మీద నమ్మకం ఉండాలి.
వివాదాల్లో తప్పు లేదు 
ఏదో జన్మలో అంతా అయిపోయుంటుంది. అందుకే ఈ జన్మలో ఎలాంటి వివాదాలూ లేకుండా జీవితం సాగించగలుగుతున్నా. వివాదాల్లో చిక్కుకోవడంలో తప్పేమీ లేదు. అది శక్తినిస్తుంది. బహుశా నేను వాటికి ఎట్రాక్ట్ కాలేదేమో.
లక్ష్యాలు ఉండవు 
నేను కలలు కనను కాబట్టి డ్రీమ్ ప్రాజెక్టులనేవి ఉండవు. ఏదన్నా చెయ్యాలనుకుంటే సిన్సియర్‌గా చెయ్యడమే. జీవితంలో మనం ఏదన్నా కండిషన్ పెట్టుకుంటే ఆ రోజు నుంచే మన జీవితంలో సంతోషం లేకుండా పోతుంది. అది ఎవరు నేర్పించారో నాకు తెలీదు కానీ నాకు మాత్రం అది సూటవదు. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడం తెలుసు కానీ, ఈ లక్ష్యాలనేవి నాకు తెలీదు. ఓ లక్ష్యం అనేది పెట్టుకొని అది సాధించగానే, మళ్లీ ఇంకో లక్ష్యం పెట్టుకోవడం... ఈ పద్ధతికి నేను దూరం. ఇవన్నీ పెట్టుకొంటే ఇక ఎప్పుడు సంతోషంగా ఉంటాం. ఈ సంగతి తెలుసుకుంటే జీవితం చాలా సింపుల్‌గా ఉంటుంది. జీవితాన్ని వృథా చేయకూడదు. ఎన్నో చేస్తుంటాం. టైమ్ లేనట్లు ఉరుకులు పరుగులు పెడుతుంటాం. కానీ మన ఆరోగ్యం గురించి మనం ఓ అరగంట కేటాయించుకోం. జీవితంలో నిజమైన ఎమర్జన్సీ అనేది ఒకటే ఉంటుంది. అది మన చివరిదశ. అది తెలుసుకోకపోవడం మనం చేసే అతి పెద్ద తప్పు.
బౌద్ధ క్షేత్రాలు దర్శించుకున్నా 
ఇటీవల బుద్ధుడికి సంబంధించిన నాలు సుప్రసిద్ధ స్థలాల్ని దర్శించి వచ్చా. నేపాల్ సరిహద్దులకు వెళ్లా. బుద్ధుడు జ్ఞానోదయం పొందిన బుద్ధగయ, సారనాథ్, నేపాల్‌లోని ఆయన జన్మస్థలం లుంబినీ వనం, ఆయన పరినిర్వాణం చెందిన ఖుషినగర్ (ఉత్తరప్రదేశ్) సందర్శించా. అలాగే వారణాసిలోని ప్రవక్త కబీర్ సమాధి, కాశీలోని నంది దేవుణ్ణి దర్శించుకున్నా.
ఆలోచనా విధానం మారాలి 
సమస్యలు ఉండని మనుషులు ఉండరు. దేవుడికి కూడా సమస్యలే. సమస్య నుంచి ఎవరూ తప్పించుకోలేరు. దాన్ని ఎలా ఎదుర్కొంటున్నామన్నదే ప్రధానం. సంతోషమనేది మానవుడికి ఎప్పుడూ ఉండదు. అది తెలుసుకుంటే ఆలోచనా విధానం మారుతుంది. జీసస్ కానీ, బుద్ధుడు కానీ, రాముడు కానీ, మహ్మద్ ప్రవక్త కానీ మనలాగే మనుషులు. వాళ్లు అందరూ ఆరాధించే స్థాయిలో ఎందుకున్నారు, మనం ఇలా ఎందుకున్నాం అని ఆలోచించుకోవాలి. అందరం అత్యున్నత స్థాయికి అర్హులమే. సమర్థులమే. ఆలోచనా విధానమే మారాలి. మనకీ, వాళ్లకీ అదే తేడా.


-ఆంధ్రజ్యోతి డైలీ, డిసెంబర్ 13, 2011

No comments: