Wednesday, May 25, 2011

న్యూస్: ఆగస్టు నుంచి వినాయక్ - రాంచరణ్ సినిమా

చిరంజీవితో 'ఠాగూర్' వంటి సూపర్ హిట్‌ని అందించిన దర్శకుడు వి.వి. వినాయక్, 'మగధీర' వంటి రికార్డుల చిత్రంలో నటించిన రాంచరణ్ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపొందబోతోంది. ఆగస్టులో సెట్స్ మీదకెళ్లే ఈ చిత్రాన్ని డి.వి.వి. దానయ్య నిర్మించనున్నారు. వినాయక్ చెప్పిన కథ సూపర్‌గా ఉందని రాంచరణ్ తెలపగా, రాంచరణ్ ఇంతవరకు చెయ్యని పాత్రని ఇందులో చెయ్యబోతున్నారనీ, ఆయన కెరీర్‌లో ఇది మరో బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుందనీ వినాయక్ చెప్పారు. "ఈ ఇద్దరి కాంబినేషన్ సినిమా మా బేనర్ మీద తెరకెక్కబోవడం సంతోషంగా ఉంది. ఈ చిత్రం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో అద్భుతాలు సృష్టించనున్నది. పక్కా కమర్షియల్ సినిమాగా తయారయ్యే ఇందులో ఓ ప్రముఖ కథానాయిక నటించబోతోంది. ఆమె ఎవరనే సంగతితో పాటు, టెక్నీషియన్ల వివరాలూ త్వరలో తెలియజేస్తాం'' అని దానయ్య తెలిపారు.
జూన్‌లో 'రచ్చ' మొదలు
రాంచరణ్ హీరోగా 'ఏమైంది ఈ వేళ' ఫేమ్ సంపత్ నంది దర్శకత్వం వహించే 'రచ్చ' చిత్రం షూటింగ్ జూన్‌లో ప్రారంభం కానున్నది. "ఈ సినిమా మెగా అభిమానుల అంచనాలను వంద శాతం అందుకుంటుంది. రాంచరణ్ ఓ విభిన్న పాత్రలో ఇందులో కనిపిస్తారు. పక్కా ప్లానింగ్‌తో అనుకున్న వర్కింగ్ డేస్‌లోనే ఈ చిత్రాన్ని పూర్తి చెయ్యాలని నిర్మాతలు సంకల్పించారు. నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా ఈ చిత్రాన్ని తీయనున్నాం'' అని సంపత్ తెలిపారు. తమన్నా హీరోయిన్‌గా నటించే ఈ చిత్రానికి మణిశర్మ సంగీత దర్శకుడు.

No comments: