Saturday, May 21, 2011

ఫ్లాష్‌బ్యాక్: 'జగదేకవీరుని కథ'లో జలకాలాటల సీను

'జగదేకవీరుని కథ'లో జలక్రీడల సన్నివేశం ఎంత జగన్మోహనంగా ఉంటుందో దాన్ని చూసిన వాళ్లందరికీ తెలిసిందే. వరుసగా కొన్ని రోజులు ఆ సన్నివేశాన్ని షూట్ చేశారు. వాహినీ స్టూడియోలోనే ప్రత్యేకంగా కొలను నిర్మించి స్నాన సన్నివేశాలు తీశారు. బి. సరోజాదేవి, ఆమె చెలికత్తెలు, రామారావు వంటి తారలు రోజంతా నీళ్లల్లో ఉండి, జలుబుచేసి షూటింగుకు ఆటకం కలిగితే ఎట్లా? అందుకని చన్నీళ్ల కొలనుని వేడి సరస్సుగా మార్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఆ కృత్రిమ సరస్సు చుట్టూ కొంచెం దూరంలో అంటే కెమెరా ఫీల్డులోకి రాని దూరంలో బాయిలర్లు పెట్టారు. తారలు నీళ్లలో దిగేముందు ఈ బాయిలర్ల నుంచి వేన్నీళ్లు ఆ కొలనులో పోశారు. తారలకు ఇక భయం లేదనుకుంటే సన్నివేశానికి కొత్త బెడద వచ్చింది. బాయిలర్ల నుంచి వచ్చిన వేడి నీళ్ల వల్ల ఫ్లోర్‌లో ఎక్కడ చూసినా ఆవిరి. జానపద సినిమాకి ఆ పొగలు పనికిరావు. మరైతే ఆవిరి లేకుండా కొలనుని ఎలా వేడి చేయాలి? దాంతో బాయిలర్లు తీసేసి కరంటు తీగలు తగిలించి నీటిని వేడి చేశారు. తారలకి జలుబు ప్రమాదం తప్పడమే కాక, ఆ సీన్లు రసవత్తరంగా వచ్చాయి.

No comments: