Saturday, May 7, 2011

ఫ్లాష్‌బ్యాక్: పద్మిని వివాహం

ఒకప్పటి అందాల తార, మలయాళ నాట్యతార పద్మిని వివాహం ఎలా జరిగిందో తెలుసా?
ఆమెకీ, డాక్టర్ కె. రామచంద్రన్‌కీ 1961 మే 25న కాలికట్ సమీపాన ఉన్న గురువాయూర్ ఆలయంలో నాయర్ కులాచార ప్రకారం వివాహం జరిగింది. వివాహ సమయంలో వధువు పద్మిని పసుపుపచ్చ పట్టుచీర ధరిస్తే, వరుడు రామచంద్రన్ జరీ ధోవతి ధరించారు. తాళి కట్టిన తర్వాత వరుడు, వధువు ఒకరి మెడలో ఒకరు పుష్పమాలలు వేసుకున్నారు. పెళ్లి తతంగం కొద్ది నిమిషాల్లోనే ముగిసింది. కొద్దిమంది ఆహ్వానితులు మాత్రమే వివాహానికి వచ్చారు. అనేక గ్రామాల నుంచి వచ్చిన 20 వేల మంది ప్రజలు ఆలయం బయట చేరారు. వివాహ సమయంలో వర్షం పడింది. అయినా జనం కదల్లేదు. దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు ఎ.ఎల్. శ్రీనివాసన్, నటి టి.ఎ. మధురం, గాయని ఎం.ఎల్. వసంతకుమారి, కొందరు పెద్దలు, 200 మంది బంధువులు హాజరయ్యారు.
వధూవరులు మే 29న మద్రాసు తిరిగి వచ్చారు. మైలాపూర్‌లోని ఇలియట్స్ రోడ్డులో ఉన్న పద్మిని భవనం ముందు పెద్ద పెద్ద గుంపులుగా జనం చేరారు. 29, 30 తేదీల్లో పగలల్లా జనం అక్కడే ఉన్నారు. ఆ రెండు రోజుల్లో ఇంట్లో బంధు మిత్రులకు విందు సత్కారాలు జరిగాయి. భిక్షగాళ్లకు దానాలిచ్చారు. 30 రాత్రి మౌంట్ రోడ్డులోని అబట్స్‌బరీలో గొప్ప విందు జరిగింది. దాదాపు ఆరు వేల మంది ఈ విందుకు హాజరయ్యారు.

No comments: