Monday, May 23, 2011

అక్కినేని నాగార్జున: రజతోత్సవ కథానాయకుడు

సినీ కథానాయకునిగా అక్కినేని నాగార్జున పాతికేళ్ల కాలం పూర్తి చేసుకున్నారు. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు వారసునిగా చిత్రసీమలో కాలిడినా, సొంత ప్రతిభావ్యుత్పత్తులతో అగ్ర కథానాయకుల్లో ఒకరిగా ఎదిగారు. హీరోగా ఆయన నటించిన తొలి చిత్రం 'విక్రమ్' 1986లో విడుదలైంది ఈ రోజే (మే 23). బాలీవుడ్ సూపర్ హిట్ ఫిల్మ్ 'హీరో'కి రీమేక్‌గా వచ్చిన ఈ సినిమా పెద్ద మ్యూజికల్ హిట్టయ్యి, నాగార్జున సినీ జీవితానికి చక్కని పునాది వేసింది.
యాక్షన్, సెంటిమెంట్, లవ్, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రధానాంశాలుగా వచ్చిన ఈ చిత్రంలోని పాటలు కొన్నాళ్ల వరకు మారుమోగుతూనే ఉన్నాయి. మొదట్లో అభినయం, వాచకం విషయాల్లో విమర్శల్ని ఎదుర్కొన్న నాగార్జున పట్టుదలతో వాటిలో పరిణతి సాధించారు. సినిమా సినిమాకీ నటునిగా ఎదుగుతూ వచ్చారు. తొలి సినిమా వచ్చిన ఏడాదికే దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఆయన నటించిన 'మజ్ను' చిత్రం ఆయన కెరీర్‌కి బ్రహ్మాండమైన ఊతాన్నిచ్చింది. ఆ సినిమా నుంచీ నటునిగా ఆయన ఏవిధంగా పరిణతి సాధిస్తూ వచ్చిందీ మనం చూశాం.
ఆ సినిమాతో తెలుగు సినిమా గతే మారిపోయిందన్నది అందరూ ఒప్పుకునే నిజం. ఆడియోగ్రఫీ, రీరికార్డింగ్ అనే వాటికి అధిక ప్రాధాన్యం వచ్చింది ఈ సినిమా నుంచే. చిత్రమేమంటే ఆ సినిమాకి ఆర్నెల్ల ముందు అదే ఏడాది వచ్చిన 'గీతాంజలి'లో పూర్తి భిన్నమైన ప్రేమికుని పాత్రలో నాగార్జున అభినయం విమర్శకుల్ని సైతం మెప్పించింది. అప్పట్నించీ కెరీర్‌లో వెనుతిరగని ఆయన అన్ని రకాల పాత్రలతో ఇటు క్లాస్, అటు 'మాస్' ప్రేక్షకుల్ని సమానంగా అలరిస్తూ వస్తున్నారు.
'లార్జర్ దేన్ లైఫ్' పాత్రలైన 'అన్నమయ్య', 'శ్రీరామదాసు'గా అద్భుతంగా అభినయించి సమకాలీన కథానాయకుల్లో తనకంటూ ప్రత్యేకతని నిలుపుకున్నారు. ప్రస్తుతం 'శిరిడీసాయి'గా నటించేందుకు ఉద్యుక్తులవుతున్నారు. భవిష్యత్తులో ఈ అగ్ర నటుడు మరిన్ని మైలురాళ్లను అందుకోవడం ఖాయం.

No comments: