Tuesday, May 17, 2011

ఫోకస్: రజనీకాంత్ 'రాణా' వెలుగు చూస్తుందా?

ఇప్పుడు అందరి చూపూ రజనీకాంత్ సినిమా 'రాణా' మీదే. ఆ సినిమా అసలు షూటింగ్ జరుపుకుంటుందా? లేక ఆగిపోతుందా? అనే ప్రశ్నలు అందరి మనసుల్నీ తొలుస్తున్నాయి. ఏప్రిల్లో ఈ మెగా బడ్జెట్ సినిమా సెట్స్ మీదకెళ్లింది. హీరోయిన్లుగా దీపికా పదుకోనే, ఇలియానా ఎంపికయ్యారు. నెల రోజుల వ్యవధిలో రజనీకాంత్ మూడు సార్లు హాస్పిటల్ పాలవడంతో సినిమా షెడ్యూలంతా డిస్టర్బయ్యింది. వాంతుల కారణంగా ఏప్రిల్ 29న ఆయన చెన్నైలోని సెయింట్ ఇసాబెల్ హాస్పిటల్లో చేరి, అదే రోజు సాయంత్రం డిశ్చార్జయ్యారు.
తిరిగి మే 4న జ్వరం, శ్వాసకోశ ఇబ్బందులతో అదే హాస్పిటల్లోని ఐసీయూలో చేరారు. నెల రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాల్సిందిగా డాక్టర్లు ఆయనకు సూచించారు. దీంతో నిర్మాణ సంస్థ ఈరోస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇబ్బందుల్లో చిక్కుకుంది.
మరోవైపు హీరోయిన్లు దీపిక, ఇలియానా కాల్షీట్లు ఇరకాటంలో పడ్డాయి. ఈ నెలలో కొన్ని కాల్షీట్లు ఇచ్చిన దీపిక జూన్-జూలైలోనూ మరికొన్ని కాల్షీట్లు ఇచ్చింది. ఈలోగా రజనీకాంత్ కోలుకుని మళ్లీ షూటింగ్‌కి హాజరైతే ఓకే. లేదంటే ఏంచేయాలోనని అంతా తలల పట్టుకుంటున్నారు. మరోవైపు 'రాణా' షూటింగ్ యధాతథంగా జరుగుతుందని డైరెక్టర్ కేయస్ రవికుమార్ చెబుతున్నాడు. 'రాణా' టైటిల్ మార్పు కోసం ఆయన న్యూమరాలజిస్టుల్ని సంప్రదించాడు. థాయిలాండ్, లండన్‌లలో షూటింగ్ కోసం ఆయన షెడ్యూల్స్ వేయడంలో మునిగిపోయాడు.
ఈ సినిమా కోసం ఈరోజ్ సంస్థ 150 కోట్లని కేటాయించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమా ఆగితే ఏంచెయ్యాలనేది దాని ముందున్న సవాలు. మరి 'రాణా' ముందుకు కదులుతాడా? రజనీకాంత్ కోలుకుని ఎప్పడు షూటింగులో పాల్గొంటాడో...

No comments: