Wednesday, June 16, 2010

Future awaits for 'Jessie'

యువతని "జెస్సీ తెలుసా?" అని అడిగి చూడండి. "ఎందుకు తెలీదు. అందుకే కదా కార్తీక్ (నాగచైతన్య) 'ఏమాయ చేసావె' అన్నాడు" అంటారు ఠక్కున. అంతలా జెస్సీ పాత్రతో ఆకట్టుకుంది, అలరించింది మృదుమధురంగా కనిపించే సమంత. అక్కినేని నాగేశ్వరరావు అంతటాయన్ని కూడా తన అభినయంతో మెప్పించిన ఆమె ఇప్పుడు ఒకదాని వెంట ఒకటిగా క్రేజీ హీరోల సినిమాల్లో ఎంపికవుతూ, తోటి తారలకు అసూయ రేకెత్తిస్తోంది. ప్రస్తుతం ఎన్‌టీఆర్ సరసన రెండో నాయికగా 'బృందావనం'లో నటిస్తున్న ఆమె మరో రెండు పెద్ద సినిమాల్లో నాయికగా ఎంపికైంది. వాటిలో మొదటిది అగ్ర కథానాయకుడు మహేశ్ సరసన కావడం విశేషం. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్ళబోతోంది. అలాగే 'బొమ్మరిల్లు' హీరో సిద్ధార్థ్‌తో దిల్ రాజు నిర్మించనున్న చిత్రంలోనూ ఆమె నాయికగా ఎంపికైంది. వేణు శ్రీరాం అనే దర్శకుడు ఈ చిత్రం ద్వారా పరిచయం కాబోతున్నాడు. ఇలా క్రేజీ ప్రాజెక్టుల్లో నటించే అవకాశాలు పొందుతున్న సమంత పూర్వీకులు తెలుగువాళ్లే అయినా తల్లి మలయాళీ కావడం, పుట్టిందీ, పెరిగిందీ చెన్నైలో కావడం వల్ల తెలుగు తెలీకుండా పెరిగింది. చెన్నైలోని స్టేరీ మెల్లా కాలేజీలో బీకాం చదివేప్పుడు ఆమెకి మోడలింగ్ అవకాశాలు వచ్చాయి. అదే సమయంలో ఓ తమిళ సినిమాలోనూ నాయికగా ఎంపికై, డైరెక్టర్ గౌతం మీనన్ దృష్టిలో పడింది. మొదట సినిమాల్లో చెయ్యడానికి వెనుకాడి, చివరికి 'ఏమాయ చేసావె'తో పరిచయమయ్యింది. దాంతో ఆమె దశే తిరిగింది. రాత్రికి రాత్రే యువతరం ఆరాధ్య తారగా మారింది. అందుకు తగ్గట్లుగా పెద్ద సినిమాల్లో అవకాశాలు వస్తుండటంతో భవిష్యత్ టాప్ హీరోయిన్ ఆమే అంటున్నాయి సినీ వర్గాలు. ఇక కాజల్ అగర్వాల్ జాగ్రత్తగా ఉండాల్సిందే!

No comments: