Thursday, June 30, 2011

ఫ్లాష్‌బ్యాక్: ప్రిన్సిపాల్‌ని చంపిన విద్యార్థి

ఈ రోజుల్లో టీచర్లు, లెక్చరర్ల పట్ల విద్యార్థులు అగౌరవంగా ప్రవర్తిస్తున్నారని వాపోతుంటాం. కానీ 20 వ శతాబ్ది తొలి రోజుల్లోనే ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఓ విద్యార్థి ఎలా ప్రవర్తించాడో చూడండి...

"1917 ప్రాంతంలో మద్రాసులో న్యూయింగ్‌టన్ కాలేజీ ఉండేది. మద్రాసు రాష్ట్రంలోని మైనర్ జమీందారుల కోసం ఇది పెట్టారు. తండ్రులు చనిపోతే జమీలను నిర్వహించే స్థోమత పిల్లలకొచ్చేవరకూ వాళ్లను ఈ కాలేజీలో ఉంచి చదివించేవారు. అప్పట్లో ఆ కాలేజీకి 'డీలాహే' అనే ఆంగ్లేయుడు ప్రిన్సిపాల్‌గా ఉండేవాడు. చాలా నిక్కచ్చి మనిషి. అదే కాలేజీలో రాంనాడ్ రాజా కొడుకు చదువుకుంటున్నాడు. ఆ ప్రిన్సిపాల్ భార్యతో ఈ పిల్ల జమీందారు అసభ్యంగా ప్రవర్తించాడు. అది ప్రిన్సిపాల్ చెవికెళ్లింది. మర్నాడు డీలాహే ఈ రాంనాడ్ పిల్ల జమీందారును మందలించాడు. ఆ రోజు రాత్రి ప్రిన్సిపాల్ తన ఇంట్లో మంచానికి దోమతెర వేసుకుని నిద్రపోతున్నాడు. ఆ సమయంలో పిల్ల జమీందారు తుపాకీతో కాల్చి ప్రిన్సిపాల్‌ను చంపాడు. 1917లో ఈ కేసు రాష్ట్రాన్ని కుదిపేసింది. ప్రభుత్వం కలవరపడింది. ముద్దాయికి తేలిక శిక్ష పడింది. ఈ అలజడితో ఆ కాలేజీని ప్రభుత్వం మూసేసింది."
-ఏటుకూరి ప్రసాద్ రచన 'తాపీ ధర్మారావు జీవితం-రచనలు' నుంచి

No comments: