Wednesday, June 15, 2011

ఇంటర్వ్యూ: సంగీత దర్శకుడు చక్రి

"పాట అంటే నా దృష్టిలో 60 శాతం సాహిత్యం, 40 శాతం బాణీలు. పాటలో గాత్రమే ప్రధానం. సాహిత్యం వినిపించని పాట పాటే కాదు'' అని చెప్పారు సంగీత దర్శకుడు చక్రి. ఎన్నో సూపర్ హిట్ పాటలకి బాణీలు కూర్చిన ఆయన చిత్రసీమకొచ్చి పదేళ్లవుతోంది. కొన్నేళ్లుగా సేవా కార్యక్రమాలూ చేస్తూ వస్తున్న ఆయన బుధవారం పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తన అనుభవాల్ని పంచుకున్నారు. అవేమిటో ఆయన మాటల్లోనే...
చిత్రసీమకి వచ్చాక ఇది పదో పుట్టినరోజు. నిర్మాతలు, దర్శకులు, హీరోల ప్రోత్సాహంతో ఇన్నేళ్లుగా కెరీర్‌ని కొనసాగించ గలుగుతున్నా. ఇన్నేళ్లలో మంచి దర్శకులతో పనిచేశా. మంచి హిట్స్ ఇవ్వగలిగా. అయితే మహేశ్‌బాబు, పవన్ కల్యాణ్, వెంకటేశ్, రాంచరణ్ వంటి హీరోలతో పనిచేసే అవకాశం ఇంతవరకు రాలేదు. రాబోయే రోజుల్లో వారితో పనిచేస్తాననే ఆశిస్తున్నా. బాలకృష్ణతో తొలి సినిమా 'సింహా' పెద్ద హిట్టవ్వడం హ్యాపీ. ఆయన్ని ఎన్నిసార్లు కలిసినా 'చాలా మంచి పాటలిచ్చావు' అని మెచ్చుకున్నారు. 'త్వరలో మనం మళ్లీ కలిసి పనిచేస్తాం' అని కూడా చెప్పారు.
అలా అయితే ఫీలవుతా
'చుక్కల్లో చంద్రుడు', 'చక్రం' వంటి సినిమాల్లో మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. అవి సరిగా ఆడకపోవడం వల్ల కాస్త బాధుంటుంది కానీ తప్పదు కదా. నా సినిమా హిట్టయ్యాక వెంటనే అవకాశాలు రాకపోయినా, ఆ సినిమా డైరెక్టర్ నుంచి మరో ఆఫర్ రాకపోయినా ఫీలవుతా. పూరి జగన్నాథ్‌తో ఎప్పుడూ కలిసి పనిచేయాలనే ఉంటుంది. ఇప్పుడెందుకు చెయ్యట్లేదనే ప్రశ్న నన్ను కాక ఆయన్నడిగితేనే కరెక్టు. మళ్లీ ఆయనతో కలిసి పనిచేసే రోజు దగ్గర్లోనే ఉందనుకుంటున్నా.
నా పాటల్లో సాహిత్యం వినిపిస్తుంది
ఆడియో మార్కెట్ పడిపోయింది. అయితే వినేవాళ్లు బాగా పెరిగారు. రేడియోలో, ఇంటర్నెట్‌లో బాగా వింటున్నారు. గాయనీ గాయకులు కూడా పెరిగారు. బాలు తర్వాత కార్తీక్ మంచి గాయకుడని చెప్పుకోవచ్చు. గాయనీమణుల్లో గీతామాధురి అద్భుతంగా పాడుతోంది. పాట అంటే నా దృష్టిలో 60 శాతం సాహిత్యం, 40 శాతం బాణీలు. నా పాటలో సాహిత్యం వినిపించాలని కోరుకుంటా. గాత్రమే ప్రధానం. సాహిత్యం వినిపించని పాట పాటే కాదు. అందుకే నా పాటల్లో సౌండ్ రికార్డింగ్ పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తా. మిక్సింగ్‌లో తేడా వల్ల నేను చేసిన కొన్ని పాటల్లోనూ బీట్ ఎక్కువగా వినిపించి ఉండొచ్చు కానీ, ఎక్కువ వాటిలో సాహిత్యం వినిపిస్తుంది.
అతను విలక్షణ రచయిత
నా అభిమాన సంగీత దర్శకుడు ఇళయరాజా, రెహమాన్. నేను పనిచేసిన గేయ రచయితల్లో భాస్కరభట్ల రవికుమార్ మంచి రచయిత. అన్ని రకాల పాటలూ రాయగల విలక్షణ రచయిత.
తొలి బాలీవుడ్ సినిమా
ప్రస్తుతం వైవిఎస్ చౌదరి సినిమా 'రేయ్', తరుణ్, శ్రీకాంత్ సినిమా 'అనుచరుడు', రానా హీరోగా నటిస్తున్న 'నా ఇష్టం', నిఖిల్ సినిమా 'వీడు తేడా', తరుణ్ చిత్రం 'యుద్ధం', జగపతిబాబు హీరోగా నటిస్తున్న మరో సినిమా చేస్తున్నా. ప్రకాశ్ ఝా నిర్మించే ఓ హిందీ సినిమాకి పనిచేస్తున్నా. ఇది నా తొలి బాలీవుడ్ సినిమా. ఇప్పటికే నాలుగు పాటలు రికార్డ్ చేశా. ఆ సినిమాని ఎవరు డైరెక్ట్ చేసేదీ, నటీనటుల వివరాలు ఇంకా తెలీదు.
సేవా కార్యక్రమాలు
నా పుట్టిన రోజు సందర్భంగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నాం. అనాథ శరణాలయాలకు బియ్యం బస్తాలు అందిస్తున్నాం. వృద్ధాశ్రమాలకు నెల వరకు ఉదయం ఫలహారాల్ని సమకూరుస్తున్నాం. కాలేజీలో చదువుకుంటున్న పేద విద్యార్థుల ఫీజులు కట్టడం, చిత్రసీమలోని వృద్ధ కళాకారుల పిల్లలకు చదువు చెప్పించడం వంటివి చేస్తున్నాం. అలాగే అన్నదాన, రక్తదాన కార్యక్రమాలు చేపడుతున్నాం.

No comments: