Saturday, November 17, 2012

ఆకలి రాజ్యం (1981) - సమీక్ష


దేశంలో నిరుద్యోగం తాండవిస్తున్న కాలంలో కె. బాలచందర్ రూపొందించిన గొప్ప చిత్రం 'ఆకలి రాజ్యం'. ఆనాటి యువతరం ఈ సినిమాని తమ సొంతం చేసుకుంది. కథలోకి వస్తే - రంగా తన కాళ్ల మీద తను నిల్చోవాలనుకునే ఆదర్శ యువకుడు. ఆత్మాభిమాని. ఆవేశపరుడు. అందుకే ఉద్యోగం కోసం ఎక్కడకు వెళ్లినా నిరాశే ఎదురవుతుంది. ఆ నిరాశ ఆవేశంగా మారి శ్రీశ్రీ మాటల్ని ఉటంకిస్తుంటాడు. అతడికి నాటకాలు వేసే దేవి పరిచయమవుతుంది. క్లైమాక్స్‌లో రంగా క్షౌరశాలలో పనిచేస్తుండగా అతడి తండ్రి గడ్డం గీయించుకోడానికి వస్తాడు. తనని చూసి దిగ్భ్రాంతికి గురైన తండ్రికి ఆత్మ గౌరవంతో చేసే ఏ పనయినా మంచిదేననీ, దేశంలో నిరుద్యోగం పోవాలంటే అదొక్కటే మార్గమనీ చెబుతాడు రంగా. ఈ సన్నివేశం హృదయాల్ని కదిల్చి వేస్తుంది. ఈ కథను దర్శకుడు చెప్పిన తీరు, మధ్య మధ్య రంగా బృందం చేష్టలు, రంగా, దేవి మధ్య డ్యూయెట్లు ప్రేక్షకుల్ని సమ్మోహితుల్ని చేస్తాయి. 'హ్యాట్స్ ఆఫ్ టు బాలచందర్' అనిపిస్తాయి. రంగా పాత్రలో కమల్ జీవించాడు. దేవిగా శ్రీదేవి ఉత్తమ నటన ప్రదర్శించింది. గణేశ్ పాత్రో సంభాషణలు సినిమాకి ఆయువుపట్టు. అవి అడుగడుగునా ఆలోచింపజేస్తాయి. ఎమ్మెస్ విశ్వనాథన్ బాణీలు వినసొంపుగా ఉండి, పాటల్ని మళ్లీ మళ్లీ వినాలనిపించేట్లు చేస్తాయి. ఆత్రేయ, శ్రీశ్రీ అందించిన సాహిత్యానికి అందులో ప్రధాన భాగముంది. లోకనాథన్ సినిమాటోగ్రఫీ దర్శకుడి అంతరంగాన్ని అర్థం చేసుకుని పనిచేసింది.

No comments: