Saturday, July 14, 2012

'ఆకాశంలో సగం' యండమూరి 'అనైతికం'


యండమూరి వీరేంద్రనాథ్ నవల 'అనైతికం' ఆధారంగా 'ఆకాశంలో సగం' అనే సినిమా రూపొందుతోంది. రవిబాబు, ఆశా షైనీ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని నంది ప్రొడక్షన్స్ పతాకంపై మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. 'నగరంలో నిద్రపోతున్న వేళ' ఫేమ్ ప్రేమరాజ్ దర్శకుడు.
రచయిత, నటుడు పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ "అందరూ దర్శకులే నటిస్తున్న ఈ చిత్రం నిజంగా ప్రయోగాత్మక చిత్రం. యండమూరి అద్భుతంగా రాసిన 'అనైతికం'ను ప్రేమరాజ్ చక్కగా తెరమీదకు తీసుకొస్తున్నాడు'' అన్నారు. రవిబాబు మాట్లాడుతూ "ప్రేమరాజ్ నా సినిమాలకూ పనిచేశాడు. నేను చదివిన తొలి తెలుగు నవల 'అనైతికం'. ఆ కథలో ప్రధాన వేషం నేను వెయ్యడం చాలా గర్వంగా ఉంది'' అని చెప్పారు. 'అనైతికం'ను సినిమాగా తీయాలనే ప్రేమరాజ్ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాననీ, ఇది హిట్టయితే ఇండస్ట్రీలో కొత్త ధోరణి మొదలవుతుందనీ యండమూరి అన్నారు. ఇంతమంది దర్శకులు నటిస్తున్న సినిమాని నిర్మించడం తన అదృష్టమని శివకుమార్ చెప్పారు. దర్శకుడు ప్రేమరాజ్ మాట్లాడుతూ "చాలా కాలం క్రితం 'అనైతికం' చదివినప్పుడు సినిమాగా తీస్తే బాగుంటుందనుకున్నా. జనానికి ఓ మంచి సినిమా అందించాలనే తపనతో అందరూ ఈ సినిమాకి పనిచేస్తున్నారు. ఆశా షైనీకి ఇది జీవితకాల పాత్ర అవుతుంది. ఈ నెలాఖరుతో షూటింగ్ పూర్తవుతుంది'' అన్నారు.
రేవా, ఎన్. శంకర్, వి.ఎన్. ఆదిత్య, కాశీ విశ్వనాథ్, చంద్రమహేశ్, సాగర్, రాంప్రసాద్, మద్దినేని రమేశ్, దేవీప్రసాద్, కామేశ్వరరావు, కాదంబరి కిరణ్, కాకినాడ శ్యామల తారాగణమైన ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్, పాటలు: సుద్దాల అశోక్‌తేజ, సంగీతం: యశోకృష్ణ, ఛాయాగ్రహణం: కల్యాణ్ సమీ, కళ: రాజీవ్ నాయర్, సహ నిర్మాత: టి. వెంకటేశ్ యాదవ్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రేమరాజ్.

No comments: