Monday, July 2, 2012

ఎవరైనా చిన్న సినిమా అంటే నరికేస్తా


"ఎవరైనా చిన్న సినిమా అంటే నరికేస్తాను. ఎవరిది పెద్ద సినిమా? ఎవరు పెద్ద? సక్సెస్ ఈజ్ ద బిగ్. సక్సెస్ కంటే పెద్ద సినిమా మరోటి లేదు'' అని వ్యాఖ్యానించారు నూట యాభై చిత్రాల దర్శకుడు డాక్టర్ దాసరి నారాయణరావు. ఆదివారం ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్‌లో జరిగిన 'ఈ రోజుల్లో' వంద రోజుల వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. "నాకు తెలిసి ఈ ఆరేడు సంవత్సరాల్లో నా మనసుకు నచ్చినవి మూడే మూడు సినిమాలు. ఒకటి 'బొమ్మరిల్లు', తర్వాత 'అలా మొదలైంది', ఇప్పుడు 'ఈ రోజుల్లో'. ఈ సినిమా కోసం ఒక్క వారానికే థియేటర్లు బుక్ చేశారు. 'ఇది వంద రోజులు ఆడుతుంది, ఆ ఫంక్షన్‌కి నేనొస్తాన'ని చెప్పాను. సినిమాని నేను ప్రేక్షకుడిగానే చూస్తా. సినిమాలో ఏడుపు సీన్లుంటే నా కళ్లవెంట నీళ్లొస్తాయి. నవ్వు సీన్లొస్తే చంటి పిల్లాడిలా నవ్వుతాను. నేను బడ్జెట్ గురించి మాట్లాడటం లేదు. ఆ రోజుల్లో కేవలం రూ. లక్షతో పాటలు లేకుండా, అక్కడక్కడా తప్పితే మాటలు కూడా లేకుండా తీసిన 'నీడ' పెద్ద సినిమానా? చిన్న సినిమానా? 110 రోజులాడింది. ప్రేక్షకులు ఏ సినిమాని ఆదరిస్తారో అదే పెద్ద సినిమా. ఎక్కువ డబ్బు ఖర్చుపెట్టి తీసిన సినిమానో, అమెరికాలో షూటింగ్ చేసిన సినిమానో పెద్ద సినిమా కాదు. 'ప్రేమాభిషేకం' కంటే పెద్ద హిట్టు లేదు. దానికి ఊటీ కూడా వెళ్లలేదు. పాటలన్నీ విజయా గార్డెన్స్‌లోనే తీశాను. వాటికంటే గొప్ప సాంగ్స్ ఉన్నాయా, ఈ మధ్య వచ్చే సినిమాల్లో. ఈ రోజు కోట్లు గురించి మాట్లాడుతున్నారు. 'ఒసేయ్ రాములమ్మా' సినిమా నేల టిక్కెట్టు రూ. రెండు, పై టిక్కెట్లు రూ. 10 ఉన్న రోజుల్లో రూ. 22.5 కోట్లు వసూలు చేసింది. ఇవాళ రేట్ల ప్రకారం లెక్కేస్తే రూ. 220 కోట్లు అవుతాయి. రికార్డుల గురించి కాదు మాట్లాడుకోవాల్సింది, సినిమాల గురించి. 'ఈ రోజుల్లో' సినిమాలో కథలేదు. నిత్య జీవిత సత్యాలున్నాయి. ఒక అబ్బాయిని ఒక అమ్మాయి ఎలా వాడేసుకుంటుంది, ఎలా తీసి అవతల పారేస్తుంది, ఎలా నాకేస్తుంది.. ఇదీ ఇందులో ఉంది. ఇవాళ ఏదైతే యూత్‌లో నడుస్తుందో, సమ సమాజంలో ఏం జరుగుతోందో.. దాన్ని వడపోసి, చక్కని స్క్రీన్‌ప్లేతో తీశాడు మారుతి. 'ఈ రోజుల్లో' వంటివి పది సినిమాలు వస్తే చాలు'' అని ఆయన చెప్పారు.
దిల్ రాజు మాట్లాడుతూ "చిన్న సినిమాలు తీసేవాళ్లకి ఇన్‌స్పిరేషన్ 'ఈ రోజుల్లో'. ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవడానికి రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువ థియేటర్లలో విడుదలయ్యేలా చేసి సహకారం అందించాను. అన్ని తరగతుల ప్రేక్షకులు చూస్తే ఇంకా ఎక్కువగా రెవెన్యూ సాధించాల్సిన సినిమా'' అన్నారు. కేవలం 'ఈ రోజుల్లో' సక్సెస్‌ని మాత్రమే కాక దాని వెనుక ఉన్న ప్లానింగ్, కృషిని కూడా ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవాలని నిర్మాత కె. అచ్చిరెడ్డి సూచించారు. ఈ సినిమాకి పెట్టిన ఖర్చునీ, వచ్చిన కలెక్షన్లనూ చూస్తే ఇండస్ట్రీ రికార్డ్ అని చెప్పాలని నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్ చెప్పారు.
నిర్మాతల్లో ఒకరైన ఎస్.కె.ఎన్. మాట్లాడుతూ "రచయిత స్వామిని దర్శకుడిగా పరిచయం చేస్తూ రెండో సినిమా తియ్యబోతున్నాం. మేం తెలుగు ఆర్టిస్టులు, టెక్నీషియన్లతోనే సినిమాలు తీస్తాం'' అన్నారు. దర్శకుడు మారుతి మాట్లాడుతూ "డబ్బులున్నంత మాత్రాన సినిమాలు తియ్యకూడదు. సినిమాని ప్రేమించి తియ్యాలి. అప్పుడే సక్సెస్ వస్తుంది. దాసరిగారి చేతులమీదుగా వంద రోజుల షీల్డు అందుకోవడం నా జీవితంలో జరిగిన అద్భుతం. ఇప్పుడు నా కథని నమ్మి బెల్లంకొండ సురేశ్ 'బస్‌స్టాప్' నిర్మిస్తున్నారు. అది పెద్దలు, పిల్లలు కూడా చూసి ఆనందించే పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రం'' అని చెప్పారు.
ఈ సందర్భంగా ఈ సినిమా యూనిట్ సభ్యులు, డిస్ట్రిబ్యూటర్లకు దాసరి నారాయణరావు, తమ్మారెడ్డి భరద్వాజ్ వంద రోజులు షీల్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు బెల్లకొండ సురేశ్, ఎం.ఎల్. కుమార్‌చౌదరి, బి.ఎ. రాజు, సురేశ్ కొండేటి, దర్శకుడు రవికుమార్‌చౌదరి, రచయిత సంజీవి, మల్టీడైమన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ వాసు, డాక్టర్ దశరథరామిరెడ్డి, హీరోలు శ్రీ, సాయి, హీరోయిన్ రేష్మా, నిర్మాత శ్రీనివాస్, సినిమాటోగ్రాఫర్ ప్రభాకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments: